విశాలాంధ్ర-రాప్తాడు : ఈనెల 25 నుండి 29వ తేదీ వరకు 35వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో కర్నూలులోని మాంటిసోరి ‘ఎ’క్యాంప్, డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలలో జరగగా 22 రాష్ట్రాల నుండి దాదాపు 900 మంది క్రీడాకారులు హాజరై తలపడ్డారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ బాలబాలికల జట్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మంగళవారం టోర్నమెంట్ ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టరు పి. కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి
ఎల్.ఆర్.మౌర్య హాజరయ్యారు. కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు వ్యక్తి మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయని క్రీడాకారుడు నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక ఒడిదుడుకులను తట్టుకునే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటాడని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాడన్నారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం పాఠశాల స్థాయి నుండి యువత వరకు వినూత్న కార్యక్రమాలతో విభిన్న టోర్నమెంట్ లు ఏర్పాటు చేసి వారిలోని దాగివున్న నైపుణ్యాన్ని గ్రామస్థాయి నుండి గుర్తించి మంచి క్రీడాకారులుగా ఎదిగే దానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందన్నారు. ఇటీవల జరిగిన జాతీయ క్రీడల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పతకాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారునికి రూ.3 లక్షల నగదు బహుమతి ప్రకటించడం హర్షణీయమన్నారు. అనంతరం సబ్ జూనియర్ సాఫ్టుబాల్ పోటీల్లో గెలుపొందిన బాల,బాలికల జట్లకు బహుమతి ప్రధానం చేశారు. ఎస్.వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చదువుతోపాటు క్రీడలకు కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నదని, నూతన విద్యా విధానం ద్వారా చిన్న వయసులోనే విద్యార్థులు క్రీడల్లో పాల్గొని చక్కటి నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా ఎదగడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఎల్ ఆర్ మౌర్య మాట్లాడుతూ ఏపీకి జాతీయస్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని ఏ టోర్నమెంట్ తీసుకున్నా చక్కటి సమన్వయంతో నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం, ఆర్డిటి సంస్థ సహాయ సహకారాలతో ఈ సాఫ్ట్ బాల్ క్రీడ ను ఏపీలోని ప్రతి జిల్లాలోనూ అభివృద్ధి చెందేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో సాఫ్టుబాల్ ఇండియా ట్రెజరర్ శ్రీకాంత్ తోరాట్, జాయింట్ సెక్రటరీలు సి.వెంకటేశులు, శోభన్ బాబు, టోర్నమెంట్ ఆర్గనైజర్ జాకీర్ హుస్సేన్, కర్నూలు సాఫ్టుబాల్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, చంద్రశేఖర్, మాంటిస్సోరి స్కూల్స్ అధినేత రాజశేఖర్,
వ్యాయామ ఉపాధ్యాయులు కుబేర్, సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.