ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
విశాలాంధ్ర ఆస్పరి : మండల పరిధిలోని పలు గ్రామాలలో బీటీ రోడ్లు అధిక వర్షాలకు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తక్షణమే మరమ్మత్తులు చేయించాలని ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మన్న, రమేష్ లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరూరు, హలిగేర, పలుకూరబండ, ములుగుందం, జొహరాపురం, ముత్తుకూరు తదితర గ్రామాల బీటీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయన్నారు. గతుకుల రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంది. గత్యంతరం లేక ఈ రోడ్డుపై ప్రయాణించిన వాహనాలు మరమ్మతులకు రావడంతో పాటు ప్రయాణించే వారి నడుము నొప్పులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ములుగుందం నుండి పలకరబండ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థులు రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఆ గుంతులలో వర్షపు నీరు ఆగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తక్షణమే గుంతలను పూడ్చి తారు రోడ్డు వేయాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. లేనిపక్షంలో ప్రజలను, యువకులను, విద్యార్థులను రైతులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కుమారస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు రామచంద్ర, సురేష్, సురేంద్ర, వెంకటేశు, చందు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈశ్వర్, మండల కార్యదర్శి యువరాజు లు పాల్గొన్నారు.