విశాలాంధ్ర – ఉరవకొండ : రైతులు పండించిన పప్పు శనగను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని గురువారం వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలి గ్రామ సచివాలయ అధికారులకు సిపిఐ మరియు రైతు సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తాలూకా సిపిఐ కార్యదర్శి జె మల్లికార్జున మాట్లాడుతూ శనగ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ప్రభుత్వం పప్పు శనగ క్వింటాకు రూ.5,330 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో ధర క్వింటాకు రూ.4,500 ప్రయివేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన అన్ని పంటలను కూడా ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు కూడా చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్, హనుమంతు, రైతు సంఘం నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.