విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని దిగువపల్లి గ్రామ సచివాలయ ఎదుట సోమవారము ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయ కార్య దర్శి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా అన్నావృష్టి ఏర్పడి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యంగా రాయలసీమతోపాటు ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలలో అత్యంత దారుణంగా కరువు ఛాయలు ఏర్పడ్డాయి. ఈ కరువు నుండి పేదలను, వ్యవసాయ కూలీలను, రైతులను విముక్తి చేసి వలసలు ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. వ్యవసాయ పనులు లేక గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు గాని కరువు పరిస్థితులు అంచనా వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కరువు పరిస్థితుల నుండి వ్యవసాయ కూలీలను, పేదలను, రైతుల కుటుంబా లను ఆదుకోవడానికి కరువు పరిస్థితులు అంచనా వేసి, కరువు మండలాలుగా ప్రకటించి వ్యవసాయ కూలీలు, పేదల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవ సాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు, కార్యదర్శి నారాయణరెడ్డి, వి.టి.రామాంజినేయులు, సిపిఐ మండల కార్యదర్శి ఎ.నాగరంగయ్య రైతులు ప్రసాద్, వెంకటేష్, లక్ష్మీ పాల్గొన్నారు.