విశాలాంధ్ర ఆస్పరి : జీవో నెంబర్ 53ను వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుడిసె మహానంది, ఎమ్మార్పీఎస్ నాయకులు బీటెక్ వీరభద్ర, వసంత కుమారులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు మాల మహానాడు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాసి, మాదారి కురువ కులానికి సంబంధించిన వారు ఈ ప్రాంతంలో ఎవరూ లేరని బీసీ కులానికి చెందినటువంటి మాదాసి, మాదారి కురువ పేర్లతో ఎస్సీ సర్టిఫికెట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దళితులకు దక్కాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారు మళ్లించి దళితుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. 53 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి జీవో 53ను రద్దు అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ రమణ బాబుకు వినిత పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల కన్వీనర్ భరత్, దోసకాయ ఈరన్న,హరి, నరసప్ప,రమేష్,పరమేశు,హనుమన్న,తదితరులు పాల్గొన్నారు.