— జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ I
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : మట్కాలో అర్హులైన నిర్వాహకులు, తదితర వ్యక్తుల బహిష్కరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ సూచించారు. గురువారం ఆయన కళ్యాణదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసందర్భంగా పోలీసు స్టేషన్ కు వివిధ సమస్యలతో వచ్చిన పిటీషనర్లతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. పోలీసు స్టేషన్ కు వచ్చే మహిళలు, పిల్లలు, వృద్ధులు, తదితర పిటీషనర్ల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. ఏమాత్రం జాప్యం చేయవద్దని సూచించారు. అనంతరం పోలీసు స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను త్వరితగతిన డిస్పోజల్ చేయాలన్నారు. ఆతర్వాత రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది సహకారంతో పెండెన్సీ కేసులు తగ్గించాలని తెలిపారు. 174, మిస్సింగ్ మరియు యు.ఐ ( అండర్ ఇన్వెస్టిగేషన్ ) కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. డిటెక్ట్ కాని ఆరు ప్రాపర్టీ కేసులను ఈ ఏడాది ఆఖరులోపు ఛేదించాలన్నారు. కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండులో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి దొంగతనాలు జరుగకుండా నిఘా వేయాలన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల సమన్వయంతో నాటుసారా, అక్రమ మద్యంపై దాడులు ముమ్మరం చేయాలన్నారు. ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ గారితో పాటు కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, సి.ఐ హరినాథ్ లు ఉన్నారు.