విశాలాంధ్ర -అనంతపురం వైద్యం :నిత్యం దుర్బిక్ష ప్రాంతమైన రాయలసీమలో మెట్ట వ్యవసాయంలో రైతులుకు మేలు చేయడం కోసం నాలుగు దశాబ్ధాలుగా కృషి చేస్తున్న డాక్టర్ యర్రగొండ వెంకట మల్లారెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్ జీవిత సాఫల్య పురష్కారాన్ని విజయవాడలో బుధవారం అందజేసింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న వారికి ప్రభుత్వ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో భాగంగా 2023 వ సంవత్సరంలో మెట్ట వ్యవసాయ రంగంలో విశేషంగా కృషి చేస్తున్నందుకు మల్లారెడ్డికి పురష్కారంతో సత్కరించింది. విజయవాడలో ఎ కన్వెన్షన్ హాలులో బుధవారం జరిగిన పురష్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం నీరుకుంట్లపల్లి గ్రామంలో వెంకటమ్మ, యర్రగొండ హరినారాయణరెడ్డి దంపతులకు 1954 లో జన్మించిన మల్లారెడ్డి 1974లో ఆర్డిటీ సంస్థలో చేరి విన్సెంట్ ఫెర్రర్ ద్వారా ప్రేరణ పొంది మెట్ట రైతుల పురోభివృద్ధికి పాటుపడేందుకు సిద్దమయ్యారు.
అతి తక్కువ వయసులోనే ఆ సంస్థలో డైరెక్టరుగా నియమితులయ్యారు. ఒకవైపు సంస్థ ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలను అందించే కార్యక్రమాల్లో పాల్గొంటూనే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో హ్యుమన్ రిపోర్సు డెవలప్మెంట్ లో పిహెచ్డి, ఇంగ్లండ్లో ఎం.బి.ఏ పూర్తి చేశారు. ఫుల్బ్రైట్ స్కాలరగా అమెరికాలో వర్షాభావ వ్యవసాయంపై ఆరు నెలలు పాటు పరిశోధనలు చేశారు.
1998లో ఆక్సిన్ ఫ్రాటర్న ఎకలజీ సెంటర్ సంస్థకి డైరెక్టర్ గా నియమితులు అయ్యీ దాని ద్వారా వర్షాభావ ప్రాంతాల్లో మెట్ట వ్యవసాయం, ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పనపై కృషి చేస్తున్నారు.
వారు లోతైన అవగాహనతో, సామాజిక స్పృహతో, తన అనుభావాన్ని రంగరించి సామాన్యులకు సైతం అర్ధమైయే రితిలో “అనంత ప్రస్థానం” అనే పుస్తకము వ్రాసినారు. దానిలో ఉమ్మడి అనంతపురము జిల్లా సామాజిక, ఆర్థిక, భౌగోళిక మరియు రాజకీయ అంశములను నిశితంగా స్పష్టంగా వివరిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి ఆచరనాత్మకమైన సూచనలు చేసారు.
అలాగే ఇతర పరిశోధకులతో కలిసి “క్లైమేటసి -డ్రాట్ రెసిలియన్స్ ఇన్ ఎక్సట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ” అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని కూడా వ్రాసారు. డా. మల్లారెడ్డి నాయకత్వంలో ఎకాలజీ సెంటరు అమలు పరచిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు సృజనాత్మకంగా, పేద రైతుల, రైతు కూలీల ఆదాయ భద్రత కొత్త ఒరవడి కలిగియుండి, చాలా ప్రభుత్వ విధానాలను గ్రామీణ పేదలకు మరియు నిత్యం కరువులకు గురయ్యే వర్షధార వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి దోహదం చేనాయి.
అనంతపురము జిల్లాలో “అనంత జలవలయం” (అనంత వాటర్ గ్రిడ్ ) ఏర్పాటు చేయాలని గత 30 సంవత్సరాలుగా డా. మల్లా రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అనంతపురము జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి చరువును అనుసంధానం చేసి, నదీ జలాలతో నింపితే ఆ చెరువులు ఆయా గ్రామాలకు బహుళార్ధక ప్రాజెక్టులుగా ఉపయోగపడి వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని మరియు గ్రామీణజీవనోపాధులని సుస్థిరం చేస్తాయి. హంద్రీ నీవా, తుంగభద్ర ప్రాజెక్ట జలాలతో చరువులను నింపడం మొదలు కావడంతో తన కల కొంత వరకు సాకారం అయిందని మల్లారెడ్డి భావిస్తున్నారు.
అనేక అవార్డులు పురష్కారాలు
నాలుగు దశాబ్ధాలుగా మల్లారెడ్డి చేస్తున్న సేవలకు అనేక అంతరజాటీయ అవార్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పురస్కారాలాను అందుకున్నారు.
ప్రస్తుతం మల్లారెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ సభ్యులుగా వున్నారు. అంతకమునుపు 2004లో రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జయతీ ఘోష్ కమిటీలో సభ్యులుగా వున్నారు.
అందుకున్న కొన్ని అవార్డులు..:
1.కేంద్ర జలవనరుల విభాగం నుంచి ఉత్తమ ఎన్జీవో బహుమతి
2.ఎఫ్ఐసిసిఐ నుంచి జాతీయ స్థాయి సుస్థిర వ్యవసాయం అవార్డు
3.మహీంద్ర అండ్ మహీంద్ర నుంచి కృషి సహయోగ్ సమ్మాన్ అవార్డు
4.రైతు నేస్తం ఫౌండేషన్ నుంచి రైతు నేస్టం అవార్డు
5.శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ అవార్డు
6.ఎన్జీరంగ కిసాన్ సేవా సమితి నుంచి జీవన సాఫల్య పురష్కారం.
7.రాష్ట్ర ప్రభుత్వం నుంచి జలమిత్ర అవార్డు
8.రాష్ట్ర ప్రభుత్వం నుంచే బయోడైవర్శిటీ కన్జర్వర్ అవార్డు
9.అనంత ఆణిముత్యాలు అవార్డు.