Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2 నింగిలోకి దూసుకెళ్లింది. సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి ఈ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో షార్‌లోని శాస్త్రవేత్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2 రాకెట్‌ 334 కిలోల బరువుండే మూడు రాకెట్లతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో రెండు దేశీయ ఉపగ్రహాలు కాగా, అమెరికాకు చెందిన ఓ ఉపగ్రహం ఉంది. వీటిని 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. తొలి ఉపగ్రహమైన ఈవోఎస్‌-07ను 785 సెకన్లకు, రెండోదైన జానుస్‌-1ను 880 సెకన్లకు, చివరిదైన ఆజాదీశాట్‌ను 900 సెకన్లకు వరుసగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
వీటిలోని ఈవోఎస్‌-07 ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. దీని బరువు 156.3 కేజీలు. అలాగే, ఆజాదీశాట్‌-2 ఉపగ్రహాన్ని చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు రూపొందించారు. దీని బరువు 8.7 కేజీలు. ఇక, జానుస్‌-1ను అమెరికాకు చెందిన అంటారిస్‌ సంస్థ అభివృద్ధి చేసింది. దీని బరువు 11.5 కేజీలు. కాగా, ప్రయోగ ప్రారంభానికి ముందు ఈ తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 6.30 గంటలపాటు కౌంట్‌ డౌన్‌ కొనసాగిన అనంతరం రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img