పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి వామపక్షాలు మద్దతు తెలిపాయి. మంగళవారం ఉదయం విజయవాడలోని దాసరి భవన్లో వామపక్షాలు సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. పీఆర్సీ అనేది ఎప్పటి నుంచో ఉందని, ఉద్యోగులు కూడా న్యాయబద్దంగానే పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నారన్నారు. 18 మాసాల పాటు మిశ్రా కమిషన్ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే.. ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కమిషన్ నివేదికను వెంటనే ఉద్యోగులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఉద్యోగులకు వామపక్షాలు అండగా ఉంటాయని రామకృష్ణ స్పష్టం చేశారు.