ఏపీ ప్రభుత్వం యాప్లు, వైరస్, మాల్వేర్ను గుర్తించి, తొలగించేందుకు మరో సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా.. ‘దిశ సైబర్ కవచ్’ లు వచ్చేశాయి. మొబైల్ ఛార్జింగ్ పిన్ నుంచి యూఎస్బీ కేబుల్ ద్వారా ఆ సైబర్ కవచ్ మెషిన్కు అనుసంధానం చేస్తే.. ఆ మొబైల్లో ఉన్న సమాచారాన్ని బట్టి వైరస్ను గుర్తిస్తుంది. మొబైల్లో తెలియకుండా యాప్లు, సాఫ్ట్వేర్లను గుర్తిస్తుంది. వాటిని వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. ఇలా సైబర్ మోసాలను గురికాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు పోలీసులు. ఎవరైనా వచ్చి ఈ మెషిన్కు ఫోన్ను అనుసంధానం చేసి వైరస్ను డిలీట్ చేసుకోవచ్చని.. సిబ్బంది కూడా సహాయం అందిస్తారని తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి చెప్పారు.ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ కవచ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా పోలీసు కార్యాలయం, దిశ పోలీసుస్టేషన్, డీఎస్పీ కార్యాలయాల్లో ఈ మెషిన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ వీటి సేవలు పొందవచ్చు.. ఈ మెషిన్ దగ్గర సహాయంగా ఉండేందుకు ఒకరికి శిక్షణ కూడా ఇచ్చారు. ఎవరైనా వచ్చి ఈ మెషిన్కు ఫోన్ను అనుసంధానం చేసి వైరస్ను డిలీట్ చేయొచ్చు.దిశ సైబర్ కవచ్ చూడటానికి ఏటీఎం మిషన్ తరహాలో ఉంటుంది. గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ నుంచి వీటిని కొనుగోలు చేశారు. పోలీస్ స్టేషన్లు, ఎస్పీ కార్యాలయాలతో పాటూ ప్రముఖ బస్స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోయాయి. మొబైల్స్లో ఏవేవో యాప్లు వచ్చేస్తున్నాయి.. తెలియకుండానే సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ కావడంతో ఫోన్లో డేటాను కేటుగాళ్లు సేకరిస్తున్నారు. లింకులు, ఆ యాప్ల ద్వారా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఫోన్లలో తెలియని యాప్లు, వైరస్, మాల్వేర్ను ఈ కవచ్ గుర్తించి తొలగించొచ్చు.