రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తున్నా.. దానిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏనాడూ సీఎంను పిలిచి మాట్లాడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేసినా..రాష్ట్ర పెద్దగా ఏ ఒక్కరోజు గవర్నర్ మాట్లాడలేదని, అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్కు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, కనీసం దీనిపై గవర్నర్ స్పందించలేదని విమర్శించారు. మూడు రాజధానుల బిల్లులో గవర్నర్ కూడా తప్పు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ బిల్లులు సరికాదని కోర్టులు కూడా చెప్పాయన్నారు. ఎన్నికల సంఘంపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదని, ఈసీని ఎవరికీ తెలియకుండా తొలగించారన్నారు. సీఆర్డీఏ చట్టాన్ని రాత్రికి రాత్రే రద్దు చేశారని మండిపడ్డారు. అందరూ ఒప్పుకున్న చట్టాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ప్రశ్నించకుండా సంతకం చేశారని విమర్శించారు.