వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేశారు. సమగ్ర సర్వే ప్రగతిని సీఎం జగన్ ఆరా తీశారు. సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భూ సమగ్ర సర్వేతో దశాబ్దాల నుంచి ఉన్న భూ వివాదాలు పరిష్కారమవుతాయని సీఎం అన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం సమగ్ర సర్వే ప్రధాన ఉద్దేశంలో ఒకటని సీఎం అన్నారు. సమగ్ర సర్వేను నిర్ణీత టైంలోగా పూర్తి చేయాలని, అందుకు అన్ని చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. సర్వేకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రోన్స్, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు సమకూర్చుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి అంశంలోను వేగంగా పనిచేస్తూ సమగ్ర సర్వేను పూర్తి చేయాలన్నారు. భూ సమగ్ర సర్వేను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సర్వే జరుగుతోందన్న సీఎం.. ఈ సర్వేను పూర్తిచేయడంతో ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.