Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్‌ సమీక్ష..

అధికారులకు కీలక ఆదేశాలు..
విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనం పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతిపైనా సమీక్ష చేపట్టారు. దానిచుట్టూ సివిల్‌ వర్క్స్‌, సుందరీకరణ పనులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎం జగన్‌కు వివరాలందించారు అధికారులు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్‌ వర్కులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు అధికారులు.స్మృతివనం ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని తెలిపారు అధికారులు. విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామన్నారు.

విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్‌ వర్క్స్‌, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎం జగన్‌కు వివరించారు అధికారులు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు. పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని అధికారులకు ఆదేశించారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు.స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా అత్యంత ప్రధానమైనదన్నారు సీఎం జగన్‌. నిర్మాణంలో నాణ్యతతో పాటు.. సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు సీఎం జగన్‌. కాగా, ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జునతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img