జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్తో పోల్చారు..ఎమ్మెల్యే కొడాలి నాని. కేఏ పాల్ మునుగోడులో.. పవన్ కళ్యాణ్ ఇప్పటంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదన్నారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఇటీవలే నానా హంగామా చేశారని.. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం వెళ్లి మరోసారి నానా హంగామా చేశారని గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటంలో పరుగులు పెట్టారన్నారు. ఈ మేరకు శనివారం గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో కేఏ పాల్ ఎంటర్టైన్మెంట్తో రక్తి కట్టించారని.. ఆయన కంటే వెనకబడిపోయానని పవన్ ఇప్పటం వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటంలో షో అయిపోగానే 2 గంటల కల్లా వెళ్లిపోయారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని.. ఇలా షోలు చేయకూడదని కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంటే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్కు నిద్రపట్టడం లేదన్నారు. అసలు, రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. లేని సమస్యలను పవన్, చంద్రబాబు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వారిద్దరూ వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారని పేర్కొన్నారు. తాగుబోతులు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు హడావుడి చేస్తే రెక్కీ అన్నారని.. చంద్రబాబుపై గులకరాయితో హత్యాయత్నం జరిగిందంటూ డ్రామాలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులన్నారు. హైదరాబాద్లో రెక్కీ డ్రామా జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే సంబంధమా అని ప్రశ్నించారు. రెక్కీ పేరుతో పవన్ కళ్యాణ్ గాలిమాటలు మాట్లాడారని.. జూబ్లీహిల్స్లో రెక్కీ జరిగితే చంద్రబాబుకు ఏం సంబంధమని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి ఉంటే మాట్లాడుతున్నారా అని కొడాలి నాని దుయ్యబట్టారు.