Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు

కాపులకు ఎంతో ప్రయోజనం
కాపునేస్తం నిధులు విడుదల చేస్తూ సీఎం జగన్‌
3,27,244 మంది మహిళలకు రూ.490.68 కోట్లు జమ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
తమ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో చిత్తశుద్ధితో 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహ న్‌రెడ్డి ప్రకటించారు. ఈ రిజర్వేషన్ల అమలుతో కాపులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వరుసగా రెండో ఏడాది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం సీఎం జగన్‌ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కాపులు బీసీలా? ఓసీలా? అన్న అయోమయానికి గురిచేసిందని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే న్యాయ వివాదాలు సృష్టించిందని విమర్శించారు. దానివల్ల అగ్రవర్ణ పేదలకు ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడిరదన్నారు. తమ ప్రభుత్వం అటువంటి అయోమయానికి అవకాశం లేకుండా అగ్రవర్ణ పేదలందరికీ 10శాతం రిజర్వేషన్లు కచ్చితంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనే తమ లక్ష్యమని, దీనిలోభాగంగానే వైఎస్సార్‌ చేయూత తరహాలో వైఎస్సార్‌ కాపునేస్తం తీసుకువచ్చామన్నారు. ఏటా వరుసగా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ రూ.15 వేలు చొప్పున ఐదేళ్లు క్రమం తప్పకుండా ఇస్తే రూ.75 వేలు వారి చేతిలో ఉంటాయన్నారు. మహిళలు తమ కాళ్లపై నిలబడతారనే గొప్ప ఆలోచన నుంచి ఈ పథకం పుట్టిందని వివరించారు. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఈ విధంగా ఆర్థిక సాయం చేస్తుండగా, ఇక 60 యేళ్లు దాటిన వారికి పెన్షన్‌ మంజూరు వల్ల మేలు జరుగుతుందన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం మన మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఇది చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో అక్షరాలా రూ.12,126 కోట్లు నేరుగా కాపు అక్కచెల్లెమ్మలు, సోదరుల చేతుల్లో పెట్టగలిగామన్నారు. ఈ పథకం ఎవరికైనా, ఎక్కడైనా రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామ సచివాలయానికి వెళ్లి మరలా దరఖాస్తు పెట్టుకుంటే వెరిఫికేషన్‌ చేసి నెలరోజుల్లో అర్హులకి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజా, జంగాలపల్లి శ్రీనివాసులు, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.అనంతరాములు, ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఐ శ్రీనివాస శ్రీనరేష్‌, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img