సీఎం జగన్ను ఉద్దేశించి మహానాడులో టీడీపీ నేతలు హద్దులు మీరి విమర్శలు చేశారని, అలా మాట్లాడితే సహించేది లేదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ కార్యక్రమంలో దువ్వాడ పాల్గొన్నారు. అనంతరం దువ్వాడ మాట్లాడుతూ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, తాట తీస్తానని అన్నారు. అంతేకాదు, అంకుశం సినిమాలో విలన్ ను కొట్టినట్టు రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళతానని ఘాటుగా హెచ్చరించారు. రాజకీయంగా అచ్చెన్నాయుడి అంతుచూస్తానని, అదే తన ఆశయం అంటూ స్పష్టం చేశారు. జగన్ కోసం తాను ఏమైనా చేస్తానని, ఆత్మాహుతి దళంగా మారేందుకైనా తాను సిద్ధమని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జీవితం మీద, ప్రాణం మీద ఆశ లేని వ్యక్తినని, టీడీపీ నేతలు ఈ విషయం గమనించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.