మంత్రి అనిల్ కుమార్ యాదవ్
అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంపై విపక్షాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టుపై ఆయన మీడియా సమావేశం చూశానని, చాలా విషయాలను దాచి పెట్టారని ఆరోపించారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడమే ఆయన ఉద్దేశమని ఆరోపించారు. అయితే అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం 2 లక్షల 17 వేల క్యూసెక్యులు. కానీ గంటల వ్యవధిలోనే 3 లక్షల 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. స్థానికంగా భారీ వర్షం కురిసిందని, పై నుంచి వరద కూడా విపరీతంగా వచ్చిందని, అధికారులు పగలు రాత్రి లేకుండా పనిచేశారని తెలిపారు. విపత్తు వల్ల జరిగిన ఘటనను.. మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని ఎలా అంటారని ప్రశ్నించారు. జల ప్రళయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే కేంద్ర మంత్రి షేకావత్ మాటలు చాలా బాధ కలిగించాయని అన్నారు. గంటల వ్యవధిలోనే లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని, ప్రభుత్వం తరపున చేపట్టాల్సి చర్యలు చేపట్టామన్నారు. 140 ఏళ్లుగా చూడని విపత్తు ఇది అని అన్నారు.