జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
జిల్లాలో 24,119 మందికి రూ.33.41 కోట్ల ద్వైవార్షిక నిధులు విడుదల
విశాలాంధ్ర – విజయనగరం : మధ్యవర్తిత్వం లేని.. ఎలాంటి సిఫార్సులు అవసరం లేని.. పారదర్శకమైన వ్యవస్థలో అర్హతే ప్రామాణికంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో అర్హతున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. ద్వైవార్షిక నిధుల విడుదల కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంశ్రీస్త్రమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి వివరించారు.సామాన్యుల అభివృద్దే ప్రధాన ఎజెండాగా, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్ధతు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అర్హత ఉండి అనుకోకుండా పథకాలు కోల్పోయిన వారి సౌకర్యార్థం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పథకాలు వర్తింపజేయటం హర్షణీయమన్నారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే జనవరి నుంచి పింఛను పెంపు చేస్తూ అవ్వాతాతలకు రూ.2,750 అందజేయన్నున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడు నియోజకవర్గాల పరిధిలో 2.74 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేని కొంతమంది లేనిపోని కారణాలతో ఫిర్యాదులు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని తప్పుబట్టారు.
అర్హతల మేరకే లబ్ధిదారుల గుర్తింపు ః జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారం, నిబంధనలను అనుసరించి అర్హతలు కలిగిన వారినే లబ్ధిదారులగా ఎంపిక చేశామని, ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ద్వైవార్షిక నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2.74 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన పథకాల వల్ల జిల్లాలో 99 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.