ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరడం సామాన్యుల ప్రాణాల మీదకు తెచ్చిందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం తీసుకెళ్తున్న చిన్నారి.. మంత్రి కాన్వాయ్ కోసం 15 నిమిషాలు ట్రాఫిక్ నిలిపివేయడంతో చనిపోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. సత్య సాయి జిల్లా కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గం కళ్యాణదుర్గానికి వచ్చారు. ఆమెకు పార్టీ శ్రేణులుగు ఘన స్వాగతం పలకగా.. మంత్రిగారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర స్పందించారు. మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ మృతిచెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప మృతికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణం అని వ్యాఖ్యానించారు. ‘సంబరాలు జరుపుకొన్న మంత్రి..ఆ తల్లిదండ్రుల కడుపుకోతపై సమాధానమేంటి? అని ప్రశ్నించారు.