ఏపీ ఆర్థికపరిస్థితి బాగుంటే రెండున్నర సంవత్సరాల్లో అభివృద్ధి విషయంలో పరుగులు తీసేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డికి.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కాలని దేవుడ్ని ప్రార్థించానని అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు సీఎం జగన్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జగన్ చొరవతో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ‘ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం, ఎంపీల ఒత్తిడి ఫలించింది. కేంద్ర హోంశాఖ అజెండాలో ఏపీ విభజన సమస్యల అంశం చేర్చడం సంతోషం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి ఉన్నాయి. మళ్లీ న్యాయ సమీక్షకు పోకుండా సమస్యను పరిష్కరించాలి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.