చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ సభలో మాట్లాడలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో తాను సభలో లేనని, సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష చేశానని తెలిపారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకున్నానన్నారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రస్టేషన్లో ఉన్నారని పేర్కొన్నారు.ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థంకావడంలేదని జగన్ అన్నారు. సంబంధంలేని టాపిక్ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారని, సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని సీఎం ఆరోపించారు. ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదన్నారు. కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు మాట్లాడారు తప్ప, ఇంకెవ్వరూ మాట్లాడలేదన్నారు. ఆయనే తన చిన్నాన్న, చెల్లి గురించి మాట్లాడారన్నారు. గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని తమ సభ్యులు అంటే దాన్ని మరో రకంగా మార్చి డ్రామా క్రియేట్ చేశారని విమర్శించారు సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుందన్నారు. వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారని, ఇవన్నీ మన కళ్లముందే చూశామన్నారు.