వైఎస్ఆర్ వాహన మిత్ర సాయం పంపిణీ
ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున జమ
నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన విశాఖపట్నంలో జరిగిన ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం కార్యక్రమంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను బటన్నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశామని, మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం మరోసారి గుర్తుచేశారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున నాలుగో ఏడాది ఆర్థిక సాయం అందచేశామని, అన్ని వర్గాల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు ఈ డ్రైవర్లు రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్నారని, ఏ వివక్షా లేకుండా లబ్దిదారులకు సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. కులం, మతం, వర్గం అనే వ్యత్యాసం లేకుండా తమ మూడేళ్ల పాలనతో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా నాలుగో విడతతో కలిపి లబ్ధిదారులకు మొత్తం రూ.1,026 కోట్లను పంపిణీ చేశామన్నారు.నేటి ఉదయం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కు సీఎం చేరుకున్నారు. వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొని అర్హులైన డ్రైవర్లకు పది వేల సహాయం విడుదల చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అధికారులతో వరదపై సమీక్షించనున్నారు.