సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడలో పోలీసుల చర్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సీపీఎస్ను రద్దు చేయాలంటూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో టీచర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అరెస్టులు, నిరసనలతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడకు రానీయకుండా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఉపాధ్యాయులను నిర్బంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బస్టాండ్, రైల్వేస్టేషన్తో సహా పలు ప్రాంతాల్లో వందలాదిమంది పోలీసులు మోహరించారని మండిపడ్డారు. శాంతియుత నిరసనలకు అనుమతించకపోవడం దుర్మార్గమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మడమ తిప్పారని విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.