ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని అనుకోవద్దని ఎప్పుడైనా వస్తాయని రెడీగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు సూచించారు.తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు రైతు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో గెలుస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఉద్యోగుల కారణంగానే ఓడిపోయామన్నారు. ప్రలోభాలాకో.. భయపడో ఉద్యోగులు లొంగిపోయారన్నారు. వివేకా హత్య తర్వాత వచ్చిన సానుభూతి కారణంగానే జగన్ సీఎం అయ్యారన్నారు. ఓ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుడున్నంత వ్యతిరేకత ఎప్పుడూ లేదని గుర్తు చేశారు. రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న రైతులకు మేలు చేసే అన్ని పథకాలు నిలిపివేశారని కొత్త పథకాలేమీ అందరికీ అందడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతీ రైతునూ కలవాలని తెలుగురైతు ప్రతినిధులకు సూచించారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. రైతులకు ఉరితాళ్ళుగా మారిందన్నారు. దౌర్భాగ్య ముఖ్యమంత్రి హయాంలో రైతులకు యూరియా దొరకడం లేదని విమర్శించారు.