. 15 ఏళ్లయినా పైసా కేటాయింపు లేదు
. శిలాఫలకం తప్ప ఇక్కడ ఏమీ లేదు
రామకృష్ణ మండిపాటు
విశాలాంధ్ర-కె.కోటపాడు(అనకాపల్లి జిల్లా): బాబు జగజ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రజలకు కలగా మిగిలిపోయేలా ఉందని, అధికారులు కాగితాల్లో అద్భుతంగా చూపిస్తున్నారు తప్ప వాస్తవానికి ఇది ఏ మాత్రం ముందుకు సాగటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బుధవారం రామకృష్ణ అధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో సుజల స్రవంతి ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పోలవరం కెనాల్ అనకాపల్లి డివిజన్ ఇంజినీర్ పి.ఉషారాణి సీపీఐ బృందానికి తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులతో రామకృష్ణ మాట్లాడుతూ 2008లో ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సుజల స్రవంతి పనులు ఇప్పటికీ మొదలుపెట్టలేదన్నారు. ఉత్తరాంధ్రపై సీతకన్ను వేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం నుండి వచ్చే ఎడమ కాలువ ద్వారా కే కోటపాడు మండలంలో ఉన్న భూదేవి ప్రాజెక్టు ప్రాంతంలో 6.57 టీఎంసీల నీటిని నిలువ చేస్తారని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 79 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో తాగునీటికి, సాగునీటికి ఢోకా ఉండదని అన్నారు. ఇటువంటి బృహత్తరమైన ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకుండా నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బృందంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.విమల, సీపీఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు డీసీహెచ్ క్రాంతికుమార్, జి.గురుబాబు, బి.సుబ్బలక్ష్మి, ఆర్.అప్పలరాజు, చెరకు రైతు సంఘం ఉపాధ్యక్షుడు వేచలపు కాసుబాబు, మండల కార్యదర్శి గొర్లే దేవుడి బాబు, ఇల్లాకు రాము, రెడ్డి అప్పల నాయుడు, శ్రీముసురు సూర్యనారాయణ, రాము నాయు డు, పొంతపల్లి రామారావు తదితరులు ఉన్నారు.
ప్రాజెక్టులను గాలికొదిలేసిన జగన్ సర్కార్
విశాలాంధ్ర`కశింకోట (అనకాపల్లి జిల్లా): నాలుగేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కార్ గాలికి వదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం పోలవరం ఎనిమిదవ ప్యాకేజీ ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టును సీపీఐ రాష్ట్ర బృందం బుధవారం పరిశీలించింది. ముందుగా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మ్యాప్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం రామకృష్ణ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై ప్రచారమే తప్ప పనులు ప్రారంభం కాలేదన్నారు. రిజర్వాయర్ పనులు గానీ, మెయిన్ కెనాల్ పనులు గానీ జరగడం లేదని ఆరోపించారు. నిర్మాణ దశలో ఉన్న చిన్నచిన్న ప్రాజెక్టులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు, డేగా ప్రభాకర్, మధు, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎ.విమల, అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ, సహాయ కార్యదర్శులు రాజాన దొరబాబు, మాకిరెడ్డి రామునాయుడు, కార్యవర్గ సభ్యులు గురుబాబు, రాజబాబు, అప్పలరాజు, సుబ్బలక్ష్మి, మండల కార్యదర్శి సత్తిబాబు, కొండలరావు, ఫణేంద్ర, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.