టీడీపీ అధినేత చంద్రబాబు
చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.వైసిపి ప్రభుత్వం రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలని, నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలని సూచించారు. లక్షలాది మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలన్నారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా.. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని ప్రశ్నించారు. పోలీసుల కాపలాతో ఉపాధ్యాయులను నిర్బంధించడం దారుణమన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి.. ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని, ఉద్యోగులను అగౌరవపరిచే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని చంద్రబాబు సూచించారు.