తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ 99వ జయంతి వేడులకు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్కు ఘనంగా నివాళి అర్పించారు. ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, నేటి నుంచి ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరులు లాంటి వారని, ఎన్టీఆర్ ఇల్లే ఒక నటనాలయం, ఆయన అందరి గుండెల్లో ఉన్నారన్నారు నటుడు బాలక్రిష్ణ. మరోవైపు హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. టాలీవుడ్, ఇతర రంగాల ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్కు తరలివచ్చి మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆపై, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. సామాజికం, పౌరాణికం, ప్రతికూల పాత్రలను సైతం పోషించి మెప్పించారు. శ్రామికులు, రైతులు, అన్నార్ధుల కోసం తెలుగుదేశం పార్టీని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పౌరాణికం, నాటకాలు, సామాజిక అంశాలను టచ్ చేస్తూ సినీ కెరీర్ లో 300 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు.
35 అడుగుల యన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే తనువు పులకిస్తుందన్నారు. ఆయన శత జయంతిని అందరూ స్వచ్చందంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్వగ్రామం నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు తీర్మానించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విగ్రహం కడతారని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ నినదించారు, సామాన్యులను సైతం చట్ట సభల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం. పేదల గురించి ఆలోచించిన ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. నేడు యువకులు రాజకీయాల్లోకి రావాలి. ఉత్సాహంతో పని చేయాలని ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది. ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందొ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో పరిస్థితులపై మహానాడులో మాట్లాడతానని చెప్పారు.