ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. టీడీపీ సభ్యులు గొడవ చేయాలనే అసెంబ్లీకి వచ్చారని.. అందుకే స్పీకర్ పోడియం దగ్గర నిరసనకు దిగారన్నారు. ఎన్టీఆర్ పేరు పలకడం చంద్రబాబుకు ఇష్టం ఉండదని.. తాను ఎప్పుడూ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు అన్నారు. ఎన్టీఆర్కు చంద్రబాబు కంటే ఎక్కువ గౌరవం ఇస్తానన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఎక్కువ కాలం సీఎంగా ఉండేవాళ్లు అని అన్నారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు దిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకుంటారని.. ఎంతోమందిని ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని చేశానని చెప్పుకుంటారన్నారు. అలాంటి చంద్రబాబు ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేలా ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. ఈ పేరు మార్చడానికి ముందు తనను తాను ప్రశ్నించుకున్నాను అన్నారు. బాగా ఆలోచించిన తర్వాతే హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పథకాల సృష్టికర్త ఎవరు అంటే అందరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. 1983 టీడీపీ పుట్టుక ముందే 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు.. మరో మూడు కాలేజీలను వైఎస్సార్ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని టీడీపీ.. వాళ్లకు కావాల్సిన పేర్లను బలవంతంగా పెట్టుకుందన్నారు. సీఎం ప్రసంగం తర్వాత అసెంబ్లీలో పేరు మార్పు బిల్లుకు ఆమోదం తెలిపారు.