ఏపీలో దొరల తరహా పాలన నడుస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాలనలో యువతకు ఉపాధి కలగా మిగిలిపోయిందన్నారు. ఓట్లు వేసి గెలిపించిన వారిపై జగన్ భస్మాసుర హస్తం పెట్టారన్నారు. ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ హామీపై నిలదీయాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం దినదినం పెరుగుతోందని చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ జగన్ గొప్పలు చెప్పుకున్నారని… ఆయన కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా… కమీషన్ల కోసం ఉన్నవాటిని కూడా తరిమేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే… జగన్ వచ్చాక దాన్ని రద్దు చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా చంద్రబాబు ఉపాధి కల్పించారని… జగన్ వాటిని రద్దు చేసి ఆయా సామాజికవర్గాల పొట్టకొట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదాను జగన్ మర్చిపోయారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ మరిచిపోయారన్నారు.