ఏప్రిల్ నుంచి వారాహిపై ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేందుకు.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యాత్రకు సంబంధించి ముహూర్తం ఖరారు, రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో పడ్డారు రాష్ట్ర నాయకులు. ఫిబ్రవరిలో సభ్యత్వాలు, మార్చిలో అవిర్భావ సభ, ఏప్రిల్ నుంచి ప్రచారం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అలాగే.. మేనిఫెస్టో, అభ్యర్థుల ఖరారు పైనా కసరత్తు జరుగుతుంది. వారాహిపై తెలంగాణలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. టీడీపీ యువనేత నారా లోకేష్ ఇప్పటికే యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా జిల్లాల పర్యటనను మళ్లీ స్టార్ట్ చేశారు. ఈనెలలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.