ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.10 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయినప్పటికీ.. కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్ (మే 5 నుంచి 23 వరకు) ప్రకారం జరగలేదు. ఆపై సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, జులై 31లోపు పరీక్ష ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కోర్టు ఇచ్చిన సమయం కంటే వారం రోజుల ముందుగానే ఫలితాలను ప్రకటిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలు మార్కులు ఇస్తున్న నేపథ్యంలో మార్కులు కోసం ఒక పద్ధతిని ఎంచుకున్నామన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చాయారతన్ నేతృత్వంలో కమిటీ వేసి ఫలితాలను అందించినట్లుగా చెప్పారు. మొదటి ఏడాదిలో ఫెయిల్ అయిన వారికి ఆబ్సెంట్ అయిన వారికి మినిమం మార్క్స్ ఇచ్చినట్లుగా తెలిపారు.