ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. అయితే ఫలితాల విడుదలపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మే 5వ తేదీన విడుదల అని, కాదు మే 7వ తేదీన అని… ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళే ఫలితాల విడుదల అంటూ కూడా ఊదరగొడుతున్నారు. దాంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది.దీనిపై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డి.దేవానందరెడ్డి స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ప్రభుత్వం ఇప్పటివరకు తేదీలు ప్రకటించలేదని స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. కాగా, ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు మే రెండో వారంలో విడుదల అవుతాయని తెలుస్తోంది.