ఏపీలో పాఠశాలల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏటా జూన్ 12 నుంచి పాఠశాలలను తిరిగి తెరుస్తుండగా.. 2021`22 విద్యాసంవత్సరంలో కరోనా వల్ల ఆగస్ట్ మూడో వారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పని దినాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని సెలవు దినాల్లోనూ పాఠశాలలు పనిచేసేలా, కనీసం 180 పని దినాలు ఉండేలా క్యాలెండర్ను సర్దుబాటు చేసింది. అయితే, సిలబస్ ఇంకా పూర్తి కానందున ఒంటిపూట బడులను ఈ నెల నుంచి కాకుండా వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది.