ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నెల్లూరుజిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం చెల్లించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు చెప్పినా చెల్లింపుల్లో జాప్యం జరగడంతో ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. మాజీ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్కు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావుకు 2 వారాల జైలు శిక్ష, జరిమానా, ఐఏఎస్ అధికారి రావత్కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశంతో పాటు హైకోర్టు నెలరోజుల గడువును ఇచ్చింది.