ఓటీఎస్ విషయంలో ఎవరూ బలవంతం పెట్టడం లేదని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. 30 లక్షల మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టిస్తోందని పేర్కొన్నారు. సీఎం జగన్ చొరవతో వన్ టైం సెటిల్ మెంట్ పెట్టారని, దానికి సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు చెప్పడం విడ్డురమన్నారు. పేదలకు భారీగా మేలు జరుగుతుంటే ఎందుకు ఈ పిలుపని ప్రశ్నించారు. చంద్రాబు వడ్డీ మాఫీ చేసిన రోజు కూడా పేదలకు ఇల్లు సొంతం కాలేదని, కానీ నేడు రిజిస్ట్రేషన్ భారం లేకుండా ప్రజలకు సంపూర్ణ హక్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల పెద్దగా ఆదాయం వచ్చేది ఏమీ లేదని, ఇంత సౌలభ్యం ఉన్న పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్పై ఎవరూ బలవంతం పెట్టడం లేదని, స్వచ్చందంగా లబ్ధిదారుల నిర్ణయం మేరకే చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులను రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పిల్లలకు ఓ మంచి ఆస్తిని ఇవ్వండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే చర్యలు ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రమంత్రి అన్నమయ్య ప్రొజెక్టుపై కనీసం కేంద్ర బృందం పరిశీలనను కూడా తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. బహుశా ఆయన పక్క టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఏమైనా మాట్లాడిరచారేమో. కొన్ని తరాలుగా అక్కడ ఇంత స్థాయి వరద రాలేదు . ఏమి జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు .దాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు’ అని విమర్శించారు.