కల్తీ సారా వల్ల మృతి చెందిన వారికి నష్ట పరిహారం అందించాలని, అవి అన్నీ ప్రభుత్వ హత్యలే అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. కొన్ని రోజులుగా ఆ ఘటనలపై లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ ఆందోళనలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా టీడీపీ నేతలు నిరసనలో పాల్గొన్నారు. ‘మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా’ అంటూ నిరసనకు దిగారు. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించింది. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ నిర్వహించింది. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కల్తీ సారా, జే బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచారంటూ అసెంబ్లీ ఎదుట శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. సహజ మరణాలు అంటూ సభా వేదికగా నిస్సిగ్గుగా సీఎం అబద్ధాలు ఆడటం బాధాకరం. కనీసం ఆఖరి రోజైనా హత్యలపై చర్చ చేపట్టాలని కోరుతున్నాం. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. కల్తీ సారా, జే బ్రాండ్లు నిషేధించాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.