ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత చంద్రబాబు..జనసేనాని పవన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కాపుల ఓట్లను ముట గట్టి వాటిని హోల్సేల్కు చంద్రబాబు అమ్మేసి.. సహకరించేందుకు దత్త పుత్రుడు రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కాపు నేస్తం మాత్రమే కాదని..కాపు కాస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాకినాడ జిల్లాలో కాపునేస్తం నిధులను సీఎం విడుదల చేసారు. సభలో సీఎం ప్రతిపక్షాల పైన ఫైర్ అయ్యారు.చంద్రబాబు తన పాలనలో కాపులకు ఏటా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి అయిదేళ్ల కాలంలో రూ 1500 కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన మోసాలు..చెప్పిన అబద్దాల్లో కాపులకు ఇచ్చిన హామీలు కలిసిపోయాయని ధ్వజమెత్తారు. తాము ప్రతీ కుటుంబానికి మంచి చేస్తున్నామని.. చేస్తున్న మంచిని నిజాయితీగా ప్రతీ ఇంటికి వెళ్లి చెబుతున్నామని సీఎం చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడైనా ప్రజలకు చేసింది నిజాయితీగా చెప్పకొనే పాలన ఉందా అని ప్రశ్నించారు. తాము కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ అనేది చూడకుండా సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఒక్కటే ప్రమాణంగా తీసుకుని మంచి చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మనం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) చేస్తుంటే చంద్రబాబు హయాంలో డీపీటీ చేసేవారని విమర్శించారు. ‘డీపీటీ’ అంటే ‘దోచుకో పంచుకో తినుకో’ అంటూ ఎద్దేవా చేశారు.