కృష్ణా నది మహోగ్రరూపం దాల్చింది. కర్ణాటకలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి వరద ఉధృతి చేరుతోంది. శ్రీశైలం జలాశయం మళ్లీ నిండు కుండలా మారింది. అక్కడ నుంచి వరద నాగార్జునసాగర్.. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీకి వరద గంట గంటకు పెరుగుతుండటంతో ఇవాళ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ఫ్లో కలిపి 4.25 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 4,28,078 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలంలో గేట్లను అధికారులు మరోసారి ఎత్తారు. జలాశయంలోని పది గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. పులిచింతల వద్ద ఔట్ ఫ్లో 4.25 లక్షల క్యూసెక్కులు ఉండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టు వందేళ్లలో తొలిసారి నిండటం గమనార్హం. అదేవిధంగా పెన్నా నదికి కూడా వరద చేరుతోంది. సత్యసాయి జిల్లాలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి 16,500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం మొత్తం జలకళను సంతరించుకోగా.. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి.