కేంద్రానికి సమాచారం పంపడంతో ఆ జాబితా నుంచి ఏపీని తొలగించారు
: ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్
దేశంలో ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్రాలు విద్యుత్ ను కొనుగోలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ లావాదేవీల్లో విద్యుత్ కొనుగోళ్లు, చెల్లించాల్సిన బకాయిల విషయంలో విద్యుత్ పంపిణీ డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తేడాలు తలెత్తుతుంటాయి. తాజాగా… ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాలపై ఆయా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్ఛేంజీల నుంచి రోజువారీ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఏపీని కూడా నిషేధించడంపై ఆ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ వివరణ ఇచ్చారు. పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేవని విజయానంద్ చెప్పారు. సమాచార లోపం వల్లే ఏపీని నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పారు. కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదని తెలిపారు. ఏపీ డిస్కమ్ లు చెల్లించాల్సిన రూ. 350 కోట్లను ఇప్పటికే చెల్లించేశామని చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి సమాచారం వెళ్లిందని… దీంతో, ఆ జాబితా నుంచి ఏపీని తొలగించారని తెలిపారు.