బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ముందు పొరుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు.. ఏపీతో పాటూ కర్ణాటక, మహారాష్ట్రలో విస్తరణ కోసం అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారత్ రాష్ట్ర సమితి శాఖను ఏర్పాటు చేసి.. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు కేసీఆర్. గురువారం ఏపీకి చెందిన బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు గురిపర్తి రామకృష్ణ యాదవ్,ఏపీ పద్మశాలీల సంఘం నాయకులు దివి కోటేశ్వరరావు, వలనుకొండ మల్లేశ్వరరావు, తోటకూర కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, నేత రామనాథం అంజన్రావులు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. బీఆర్ఎస్ ఏర్పాటుపై చర్చించారు.ఏపీలో పార్టీ శాఖ ఏర్పాటు, విస్తరణకు అధినేత ఓకే చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీ లక్ష్యాలను వివరించాలని కేసీఆర్ నేతలకు సూచించారు. బీఆర్ఎస్కు ఏపీలో మంచి ఆదరణ లభిస్తోందన్నారు నేతలు. కేసీఆర్ దార్శనికతతో తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు యావత్ దేశ ప్రజలనూ ఆకర్షిస్తున్నాయి అని ప్రశంసించారు. తెలంగాణలోలా ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రగతి పథంలో నడిపించగల సత్తా కేసీఆర్కు ఉందన్నారు. తెలంగాణలోని కేసీఆర్ పాలన, ఆంధ్రప్రదేశ్కు చెందిన బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశను రేకెత్తిస్తోంది అన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.