మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గీత భర్త రామకోటేశ్వరరావుకు కూడా బెయిల్ ఇచ్చారు. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని గీతకు హైకోర్టు ఆదేశించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశం, కేకే అరవిందాక్షన్కు కూడా ఐదేళ్ల జైలుశిక్ష, నిందితుల జాబితాలో ఉన్న విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.2 లక్షల జరిమానా విధించింది. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.