వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతో బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను శాంతింపజేందుకు దూతలుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అప్పిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి వెళ్లారు. బాలినేని నివాసానికి చేరుకున్న నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. బాలినేని ఎంతకూ దిగిరాకపోవడంతో ఆయనను నేరుగా సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయం తెలుస్తోంది. ఇప్పటికే బాలినేనితో సజ్జల రెండుసార్లు చర్చలు జరిపారు. మరోసారి బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల యత్నిస్తున్నారు. బాలినేనిని కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బాలినేనిని బుజ్జగించేందుకు ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అధిష్ఠానం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్రెడ్డి కలిసి బాలినేనిని సీఎం వద్దకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.