టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల
కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అరాచక పర్వానికి తెర తీశారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా అని ప్రశ్నించారు. కోర్టులో వేల కేసులు ఉంటే కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా అని నిలదీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వక చోరీ అని ధూళిపాళ్ల ఆరోపించారు. కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయని, రాజకీయ ప్రత్యర్థి అయిన సోమిరెడ్డి ప్రతిష్ట దిగజార్చాలని కాకాణి ఆరోపణలు చేశారని, వాటి కోసం అక్రమ ఆధారాలు సృష్టించారని విమర్శించారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ కేసులో కాకాణి ఏ1గా ఉన్నారన్నారు. కల్పిత ఆధారాలు సృష్టించిన కేసులో ఆధారాలన్నీ కోర్టులో ఉన్నాయని, కాకాణిపై ఉన్న కేసులు విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వగా.. కోర్టు ఆ జీవోను నిరాకరించిందన్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోర్టులో చోరి ఉదంతం చోటు చేసుకుందన్నారు. ఈ చోరీపై చాలా అనుమానాలున్నాయని అన్నారు. మంత్రిగా ఉన్న కాకాణికి శిక్ష పడటం ఖాయమన్నారు.న్యాయవ్యవస్థ ప్రతిష్ట కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా చోరీ జరగలేదని ధూళిపాళ్ల నరేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.