రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించగా, కొన్ని గమ్యస్థానాలను తగ్గించింది. విజయవాడ డివిజన్లోని కొండపల్లి-రాయనపాడు మధ్య మూడో లైను పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఖాజీపేట-తిరుపతి ప్రత్యేక రైలు, తిరుపతి-ఖాజీపేట ప్రత్యేక రైళ్లను, ఖమ్మం- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్- గుంటూరు మధ్య నడిచే గోల్కొండ, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను విజయవాడ, గుంటూరు, నల్లగొండ మార్గంలో నడుపుతున్నారు. ఇక సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలును ద్రోణాచలం, గుత్తి మీదుగా నడుపుతున్నారు. ట్రాకులను నిర్మిస్తుండడం, పాతవాటికి అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఈనెల 20 వరకు రైళ్ల రద్దు, దారిమళ్లింపు కొనసాగనుంది.