గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ స్పాట్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది.ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్డర్ మాట్లాడుతూ..ఈ ఘటన తనను చాలా బాధ కలిగించిందన్నారు. అతి తక్కువ సమయంలోనే నిందితుడిని అరెస్ట్ చేయడం సహా బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.గుంటూరు రూరల్, అర్బన్ పోలీస్ అధికారులు బాగా పని చేశారని, వారందరికీ అవార్డులు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా సీఎం జగన్తో భేటీ అయ్యారు.