గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని పలువురు బీజేపీ నేతలు డిమాండు చేశారు. దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా తొలగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. గుంటూరులో జిన్నా టవర్ పేరును మార్చాలంటూ సోమువీర్రాజు వీడియో విడుదల చేశారు. జిన్నా అనే వ్యక్తి పాకిస్తాన్ విభజనకు ప్రధాన కారకులని తెలిపారు. అలాంటిది… గుంటూరులో ఉన్న టవర్కు ఆయన పేరును వ్యతిరేకిస్తున్నామన్నారు. విషభీజాలు ప్రబలడానికి జిన్నా మనస్తత్వమే నాడు కారణమని… భారతదేశాన్ని శత్రు దేశంగా పాకిస్తాన్ నేటికీ పరిగణిస్తుందని అన్నారు. గుంటూరులో జిన్నా టవర్ పేరుతో పిలవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. జిన్నా పేరును తొలగించి.. దేశ స్వాతంత్య్రం కోసం పని చేసిన వారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలా దేశ విభజనకు కారణమైన వారి పేర్లు ఎక్కడ ఉన్నా మార్చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని సోమువీర్రాజు అన్నారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరిట టవర్తోపాటు ఆ ప్రాంతానికి జిన్నా పేరు ఎలా కొనసాగిస్తుంరని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అభ్యంతరం వ్యక్తంచేశారు. మరోవైపు హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణం జిన్నా పేరు తీసేసి స్వాతంత్య్ర సమరయోధులు, అబ్ధుల్కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలన్నారు.