టీడీపీ నేత గౌతు శిరీషకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ఆమెకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై కోర్టు స్టే ఇచ్చింది. సీఐడీ ఇచ్చిన నోటీసుల్ని హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విచారణకు వెళ్లిన సమయంలో కనీసం భోజనం కూడా పెట్టకుండా.. మొబైల్ తీసుకుని సీఐడీ అధికారులు ఇబ్బంది పెట్టారని శిరీష తరపు లాయర్ వాదనలు వినిపించారు. సీఐడీ ఇప్పటి వరకూ ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని.. మహిళల పట్ల ఇలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. లాయర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సీఐడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇస్తూ కేసు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది. సీఐడీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారనే అభియోగాలతో గౌతు శిరీషకు నోటీసులు ఇచ్చారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు చేశారంటూ ఓ ఫేక్ నోట్ను శిరీష సోషల్ మీడియాలో పోస్టు చేశారనే కారణంతో సీఆర్పీసీలోని సెక్షన్ 41 ఏ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఆమె సీఐడీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ సమయంలో తాను ఈ నేరం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐడీ అధికారులు అడిగారని ఆమె చెప్పుకొచ్చారు. తనపై పెట్టిన పోలీసు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. సీఐడీ జారీ చేసిన ఈ నోటీసులను టీడీపీ నేత శిరీష హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే ఓసారి సీఐడీ ప్రధాన కార్యాలయంలో గౌతు శిరీష విచారణకు వెళ్లారు. ఈ నెలలో మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆమెకు హైకోర్టులో ఊరట లభించింది.