పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి సీఎం నరసరావుపేటకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వాలంటీర్ల సత్కార సభలో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవనే భయం టీడీపీ అధినేత చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. టీడీపీ, దానికి అనుబంధంగా ఉన్న మరో పార్టీ, అనుకూల మీడియాకు ఇదే భయం ఉందని ఎద్దేవా చేశారు. దిల్లీ పర్యటనలో జగన్ కు ప్రధాని మోదీ క్లాస్ పీకారంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయని… ఎల్లో మీడియా కానీ, దీనికి అనుబంధంగా ఉన్న ఎవరైనా కానీ ఆ సమయంలో మోదీ సోఫా కింద దాక్కున్నారా? అని ప్రశ్నించారు.ప్రస్తుతం తాము రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు. రక్త పిశాచులు, దెయ్యాల మాదిరి ప్రతిపక్షం, దాని అనుకూల పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరూ ఓటు వేయరనే భయం వాళ్లతో ఇలాంటి పనులు చేయిస్తోందని అన్నారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేని దుర్మార్గులు… ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తుంటే… ఏపీ ప్రభుత్వం మరో శ్రీలంక అవుతుందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రులు, ఎల్లో మీడియా చెప్పే మాటలను నమ్మొద్దని అన్నారు.