చిరువ్యాపారుల ఆర్థిక భరోసా కల్పనకు ఉద్దేశించిన జగనన్న తోడు పథకం మూడో విడత సాయాన్ని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ సోమవారం విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.