స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ
అచ్చెన్నాయుడికి ధర్మశ్రీ సవాల్
చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులుకు మద్దతుగా రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుగా అయిన నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్కు అందించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ.. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. ముమ్మాటికీ అమరావతికి తాము వ్యతిరేకమేనని వ్యాఖ్యానించారు. వీకేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు.దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని కరణం ధర్మశ్రీ తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి వేలమందితో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. భారీ నిరసన ప్రదర్శనతో రాజధాని ఆకాంక్షను బలంగా తెలియజేస్తామన్నారు. జేఏసీ అధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని కరణం ధర్మశ్రీ తెలిపారు.రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ మూడు రాజధానులకు మద్దతుగా అవసరమైతే రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఇప్పుడు కరణం ధర్మశ్రీ ఏకంగా స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా లేఖను ఇచ్చారు.కాగా అమరావతి రైతులు విశాఖలో అడుగుపెట్టనున్న క్రమంలో కావాలనే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.